ఉత్తరాంధ్ర గర్జన రోజే పవన్ కల్యాణ్ మీటింగ్ అవసరమా?: అవంతి శ్రీనివాస్

  • ఈ నెల 15న విశాఖలో ఉత్తరాంధ్ర గర్జన
  • గర్జన అనగానే పవన్ నిద్ర లేచారన్న అవంతి
  • గర్జనలో అందరూ భాగస్వామ్యం కావాలన్న గుడివాడ అమర్ నాథ్
రాజధాని వికేంద్రీకరణకు, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఏసీ ఈ నెల 15న విశాఖలో ఉత్తరాంధ్ర గర్జనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ మాట్లాడుతూ... గర్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని అన్నారు. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు గర్జనలో పాల్గొంటాయని చెప్పారు. దండయాత్రగా వచ్చే వాళ్లంతా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసినవాళ్లు అవుతారని అన్నారు. 

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... అమరావతితో పాటు విశాఖ, కర్నూలుకు కూడా న్యాయం చేయమని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక రాజధాని ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. విశాఖ గర్జన అనగానే జనసేనాని పవన్ కల్యాణ్ నిద్ర లేచారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర గర్జన పెట్టాలనుకున్న రోజే అక్కడ పవన్ కల్యాణ్ మీటింగ్ అవసరమా? అని మండిపడ్డారు. అమరావతిలో 29 గ్రామాలు ఉంటే... ఇక్కడ ఆరు వేల గ్రామాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా నిలబడదామని అన్నారు.

Avanthi Srinivas
Gudivada Amarnath
YSRCP
Uttarandra
Gharjana

More Telugu News